నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు!

24 Jan, 2019 08:24 IST|Sakshi

తమిళసినిమా: దర్శకుడు రాజుమురుగన్‌ తనను జైలుకు పంపాలని చూస్తున్నారని గీత రచయిత యుగభారతి పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే కూక్కూ, జోకర్‌ వంటి సంచలన కథా చిత్రాలను తెరకెక్కించిన రాజుమురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం జిప్సీ. జీవా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని వెరీ వెరీ బ్యాడ్‌ అనే సింగిల్‌ సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే పాటగా ఉండడంతో విడుదలైన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో గీత రచయిత యుగభారతీ మాట్లాడుతూ దర్శకుడు రాజుమురుగన్‌ను తాను బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. అయితే ఆయన మాత్రం తనను జైల్లోకి నెట్టాలని చూస్తున్నట్లుందని పేర్కొన్నారు. అది ఈ చిత్రంలోని వెరీ వెరీ బ్యాడ్‌ పాటతోనో, మరో చిత్రంలో పాటతో జరుగుతుందో తెలియదన్నారు. ఇకపోతే ఈ పాటలో చెప్పిన విషయాలతోనే జిప్సీ చిత్రం సాగుతుందని యుగభారతి తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకుడు జీవా మాట్లాడుతూ ఒక గ్రామీణ గాయకుడు దేశం అంతా చుట్టొస్తాడన్నారు. అలా గడించిన అనుభవాలతో విప్లవాత్మకమైన గాయకుడిగా మారతాడన్నారు. అతను ఎందుకలా మారతాడన్నదాని వెనుక ఒక ప్రేమ కథ ఉంటుందని దర్శకుడు రాజుమురుగన్‌ చెప్పిన ఒన్‌లైన్‌ స్టోరీ తనకు బాగా నచ్చిందన్నారు. అదేవిధంగా తన పాత్ర చిత్రీకరణ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. ఈ చిత్ర కథలో వాస్తవాలు ఉంటాయని జీవా అన్నారు.

మరిన్ని వార్తలు