నాటకాలను బతికిద్దాం – రాఘవేంద్రరావు

19 Feb, 2018 01:20 IST|Sakshi
జయప్రకాశ్‌ రెడ్డిని సన్మానిస్తున్న సినీ ప్రముఖులు

‘‘మనకు తెలిసి రాజులెందరో ఉంటారు. ఆ రాజుల్లో రారాజు రామానాయుడుగారు. నార్త్‌ ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంతో ౖÐð భవం తీసుకొచ్చారా యన’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) రజతోత్సవ వేడుకల్లో భాగంగా డా. డి. రామానాయుడు 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ‘మా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నాటక రంగం నుంచి సినిమారంగానికి వచ్చిన నటుడు జయప్రకాశ్‌రెడ్డిని సన్మానించారు.

అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మరుగున పడిపోతున్న నాటకాలను బయటకి తీసుకురావాలి. నాటకాలను బతికించి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త కళాకారులు బయటికొస్తారు’’ అన్నారు. ‘‘నా కల్యాణ మండపం కార్ల షెడ్‌లా అయిపోతోంది. అందులో నాటకాలు వేయించండి’ అని రామానాయుడుగారు చనిపోయే ముందు నాతో అన్నారు. ‘రామానాయుడు కళా సమితి’ ఏర్పాటు చేసి నాటకాలను ప్రోత్సహించ నున్నాం. ఈ సమితిలో సభ్యత్వం తీసుకొని నాటకరంగ అభివృద్ధికి తోడ్పడాలి’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

‘‘భారతదేశ చలనచిత్ర రంగానికి రామానాయుడుగారు ఓ మోనార్క్‌. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్‌ అయిన ఆయన ఓ మహాసముద్రం’’  అన్నారు నటుడు ఆర్‌. నారాయణ మూర్తి. ‘‘మా నాన్నగారు స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులే కారణం’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు. ‘‘నలుగురు సన్మాన గ్రహీతలకు ఒక్కొక్కరికి 11వేల నగదును దర్శకుడు హరీష్‌శంకర్‌ అందించారు’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. నటులు కోటా శ్రీనివాసరావు, విద్యాసాగర్, ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేష్, ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బెనర్జీ, కార్పొరేటర్‌ ఖాజా సూర్యనారాయణ, ‘మా’  సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు