విద్య 100... బుద్ధి 0

17 Mar, 2019 03:13 IST|Sakshi
చేతన్, నరేశ్, నరేశ్‌కుమార్, మారుతి, జేబీ, మంజునాథ్‌

‘‘ఒక అద్భుతమైన పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం చాలా గొప్ప విషయం’’ అన్నారు మా అధ్యక్షుడు సీనియర్‌ నరేశ్‌. చేతన్‌ మద్దినేని హీరోగా నరేష్‌ కుమార్‌ దర్శకత్వంలో మంజునాథ్‌ వి. కందుకూర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. ‘విద్య 100శాతం, బుద్ధి 0 శాతం’ అనేది ఉపశీర్షిక. ఇందులో హీరో తండ్రి పాత్రలో నటించారు నరేశ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కన్నడంలో చాలా పెద్ద హిట్‌ సాధించిన ఈ చిత్రాన్ని అదే టీమ్‌ తెలుగులో చేయడం మొదటి సక్సెస్‌గా నేను భావిస్తున్నాను.

చార్లీ చాప్లిన్‌ కామెడీ సీన్‌ వెనక చిన్న పెయిన్‌ ఉంటుంది. ఈ ఫార్ములాతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. పాత్రను ఫీలై చేతన్‌ అద్భుతంగా నటించారు. అందరికీ కనెక్ట్‌ అయ్యే పాయింట్‌ ఇది. దర్శకుడు నరేశ్‌ మంచి వినోదాత్మకంగా తెరకెక్కించారు. తెలుగు సినిమాలపై అభిమానంతో ఓ మంచి చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనుకోవడం మంజునాథ్‌కి ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్‌ సాధించాలి’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది.

తల్లిదండ్రులు చదువుకోసం  వారి పిల్లలను ఎలా ఒత్తిడి చేస్తున్నారు? పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? అనే అంశాలను ఎంటర్‌టైనింగ్‌ చూపించారు’’ అన్నారు దర్శకులు మారుతి. ‘‘కన్నడంలో మేము చేసిన ఫస్ట్‌ ర్యాంకు చిత్రం మా జీవితాలను మార్చేసింది. విద్యార్థులకు విద్యే కాదు. బుద్ధి ఉండాలని చెప్పే సినిమా. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అన్నారు నరేశ్‌కుమార్‌. ‘‘తెలుగులో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మిస్తాను’’ అన్నారు మంజునాథ్‌. ‘‘ప్రతి ఫస్ట్‌ ర్యాంకు స్టూడెంట్‌ బయోపిక్‌ ఇది. ఈ పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు చేతన్‌. సంగీత దర్శకుడు కిరణ్‌ రవీంద్రనాథ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.

మరిన్ని వార్తలు