జానకి.. శశికళ

25 Feb, 2020 00:38 IST|Sakshi
మధుబాల, పూర్ణ

ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్‌ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్‌ (యంజీఆర్‌)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్‌ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు.

యంజీఆర్‌ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్‌ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్‌ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్‌ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్‌ సాగుతుంది’’ అన్నారు. శైలేష్‌ ఆర్, విష్ణు వర్థన్‌ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు