మడోనా.. మజాకా..

12 Apr, 2017 03:57 IST|Sakshi
మడోనా.. మజాకా..

ధనుష్‌ను పట్టించుకోకుండా నటి మడోనా ఆయనకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ మడోనా.. మజాకా..అనిపిస్తోందనే ప్రచారం ప్రస్తుతం నెటిజన్లకు ఫుల్‌మీల్స్‌గా మారింది. ‘కాదలుం కడందుపోగుం’ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతైన మాలీవుడ్‌ అమ్మడు మడోనా సెబాస్టియన్‌. తొలి చిత్రంతో పాటు ఇటీవల తాను నటించిన ‘కవన్‌’ చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి హెడ్‌వెయిట్‌ పెరిగినట్లుందని కోలీవుడ్‌ టాక్‌. అసలు విషయం ఏంటంటే నటుడు ధనుష్‌ తొలిసారిగా మోగాఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం పవర్‌పాండి.

రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటి మడోనా అతిథి పాత్రలో మెరవనుంది. అందుకుగాను ఆమె కోరిన పారితోషికాన్ని ముట్ట చెప్పారు. చిత్రం ఈ నెల 14న తెరపైకి రానున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో పాల్గొనాలని మడోనాకు ముందుగానే షరతు విధించారట. అయితే ఇప్పుడు అందుకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదట. చిత్ర నిర్మాతల తరపున ఫోన్‌ చేయగా తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని టాక్‌. వాళ్లను తను అస్సలు లెక్క చేయడం లేదట.

ఇలా పలుమార్లు చేసినా మడోనా స్పందించకపోవడంతో ధనుష్‌ వర్గం ఆమెకు ఘాటుగానే మెసేజ్‌ పంపారట. దీంతో ఈ అమ్మడు ‘మైండ్‌ యువర్‌ వర్డ్స్‌’ అంటూ సింపుల్‌గా రిప్లై ఇచ్చిందట. కాగా మడోనా చ ర్యలకు ఆగ్రహంతో ఊగిపోతున్న ధనుష్‌ వర్గం ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళ సినీ నిర్మాతల మండలి కార్యవర్గానికి తొలి ఫిర్యాదు నటి మడోనాదే కానుంది.