ధనుష్కి జంటగా మడోనా

25 Oct, 2016 03:03 IST|Sakshi
ధనుష్కి జంటగా మడోనా

ప్రముఖ కథానాయకులు వర్థమాన నాయికలతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే భావనే కలుగుతోంది. ఇళయదళపతి విజయ్ నుంచి సూర్య, విశాల్, శింబు అంటూ పలువురు హీరోలు యువ హీరోయిన్లవైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా నటుడు ధనుష్ కూడా వర్థమాన నటితో ఆడి పాడటానికి రెడీ అవుతున్నారు. నటుడిగా చాలా బిజీగా ఉన్న ధనుష్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టి పవర్‌పాండి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రసన్న, వినయ్, నటి ఛాయాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వేల్‌రాజ్ ఛాయాగ్రహణ, షాన్‌రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ చిన్ననాటి పాత్రలో ధనుష్ కనిపించనున్నారట. ఈ పాత్ర చిత్రంలో 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. బాల్య పాత్రలో ధనుష్‌తో ఆడి పాడటానికి నటి మడోనా సెబాస్టియన్‌ను ఎంపిక చేశారు. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో తెరపైకి వచ్చిన మడోనా ఈ తరువాత కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంలో తమిళంలోనూ, ప్రేమమ్ రీమేక్‌తో తెలుగులోనూ, హ్యూమన్ ఆఫ్ సమ్‌లవ్ చిత్రంతో హాలీవుడ్‌కు పరిచయం అయ్యారన్నది గమనార్హం. ప్రస్తుతం విజయ్‌సేతుపతితో మరో సారి కవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా ధనుష్‌తో నటించే అవకాశాన్ని అందుకున్నారన్న మాట. వీరి మధ్య సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారని తెలిసింది.