విజయ్‌సేతుపతితో మూడోసారి..

6 Apr, 2018 10:23 IST|Sakshi
మలయాళ నటి మడోనా సెబాస్టియన్‌

తమిళ సినిమా : విజయ్‌సేతుపతితో మూడోసారి జత కడుతోంది నటి మడోనా సెబాస్టియన్‌. కథానాయకుడిగా బిజీగా ఉన్న యువనటుల్లో విజయ్‌సేతుపతి ఒకరు. ఈయన మళ్లీ మళ్లీ సిఫార్సు చేసే హీరోయిన్లు చాలా తక్కువ మందే. వారిలో నటి గాయత్రి ఒకరైతే, రమ్యానంబీశన్‌ మరొకరు. తాజాగా ఈ పట్టికలో చేరిన నటి మడోనా సెబాస్టియన్‌. ప్రేమమ్‌ చిత్రంలో వెలుగు చూసిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కోలీవుడ్‌కు విజయ్‌సేతుపతికి జంటగానే కాదలుమ్‌ కడందు పోగుమ్‌ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సైలెంట్‌గా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత కేవీ.ఆనంద్‌ దర్శకత్వం వహించిన కవన్‌ చిత్రంలో విజయ్‌సేతుపతితో రెండోసారి జత కట్టింది. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది. అయినా ఎందుకనో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఆ మధ్య ధనుష్‌కు జంటగా పవర్‌పాండిలో రొమాన్స్‌ చేసింది.ఆ చిత్రం హిట్టే. ఇలా సక్సెస్‌ గ్రాస్‌ బాగానే ఉన్నా మడోనా సెబాస్టియన్‌ క్రేజ్‌ను పెంచుకోలేకపోయ్యిందనే చెప్పాలి. చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ విజయ్‌సేతుపతినే ఈ అమ్మడికి అవకాశం కల్పించారు. 

ఆయన కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ చిత్రం జుంగాలో మడోనా సెబాస్టియన్‌ను సిఫార్సు చేశారు. ఇందులో నటి అయేషా సైగల్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోయిన్‌గా మడోనా సెబాస్టియన్‌ నటిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూడడం విశేషం. కాగా జుంగా చిత్రం ఈ బ్యూటీ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఈ చిత్రంపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. ఆమెకు ఈ చిత్రం మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. గోకుల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాతల మండలి సమ్మె కాలంలో కూడా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇదే ఇప్పుడు వివాదానికి తెరలేపుతోంది. మరి ఈ వివాదం నుంచి సినిమా ఎలా బయట పడుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు