సాక్షి, బెంగుళూరు: బుల్లి తెర నటులు రచన, జీవన్లు గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రచన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో పార్టీ చేసుకున్న అనంతరం కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు తన ఆరుగురు స్నేహితులతో కారులో బయల్దేరారు. వీరిలో జీవన్ కూడా ఉన్నారు. కారు మాగడి వద్దకు చేరుకున్న తర్వాత వేగంగా వెళ్తున్న బస్సును తప్పించబోయిన డ్రైవర్.. రోడ్డుకు ఎడమ వైపున ఆగివున్న ట్యాంకర్ను ఢీ కొట్టాడు.
ఈ ఘటనలో రచన, జీవన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని స్థానికులు నీలమంగళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ సీరియల్ షూటింగ్ కోసం గురువారం రాత్రి రచన హైదరాబాద్కు రావాల్సివుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆమె తండ్రి గోపాల్ కన్నీరుమున్నీరయ్యారు. రచన, జీవన్లు నటించిన 'మహానంది' సీరియల్ కన్నడంలో మంచి ఆదరణ పొందింది. రచన తన కెరియర్ను 'మధుబాల' సీరియల్తో ప్రారంభించారు. జీవన్ కన్నడంలో ఇప్పుడిప్పుడే కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.