విదేశాల్లోనూ మహా విజయం

14 Aug, 2018 00:51 IST|Sakshi
ప్రియాంకా దత్, స్వప్నా దత్, కీర్తీ సురేశ్, నాగ్‌ అశ్విన్‌

జనరల్‌గా బయోపిక్‌ అంటే ఏవోవో వివాదాలు వినిపిస్తుంటాయి. ‘మహానటి’ సినిమా విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఎక్కువ ప్రశంసలే వచ్చాయి. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్‌ తిలకం’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్‌ వెండితెరపై కనిపించారు. సమంత, దుల్కర్‌ సల్మాన్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వప్నాదత్, ప్రియాంకా దత్‌ నిర్మించారు.

ఈ ఏడాది మే 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మాత్రమే కాదు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వేదికపై మంచి గౌరవం లభించింది. ‘ఈక్వాలిటీ ఇన్‌ సినిమా’ అనే అవార్డు ‘మహానటి’ చిత్రాన్ని వరించింది. ఈ అవార్డును అందుకున్నారు ‘మహానటి’ టీమ్‌. అంతేకాదు ఇందులో కథానాయికగా నటించిన కీర్తీ సురేశ్‌ ఉత్తమ నటి విభాగంలో నామినేట్‌ అయ్యారు. ‘‘ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్‌ నంబర్స్‌ ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి’’ అన్నారు స్వప్నాదత్‌.

మరిన్ని వార్తలు