మహానటి పెద్ద సవాల్‌

1 May, 2018 00:10 IST|Sakshi
మిక్కీ జె.మేయర్‌

‘‘నేనెప్పుడూ ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతాను. నా ప్రతి సినిమాలో చేశాను కూడా. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల వెనక పరిగెత్తకుండా నాకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మహానటి’. కీర్తీ సురేశ్, సమంత, నాగచైతన్య, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు.

సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ పతాకంపై ప్రియాంకాదత్‌ నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మిక్కీ జె.మేయర్‌ మాట్లాడుతూ– ‘‘నటిగా సావిత్రిగారు ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ ఆమె జీవిత విశేషాలు పూర్తిగా ఎవరికీ తెలియవు. ఆ విషయాలు ‘మహానటి’ చిత్రంతో తెలుస్తాయి.

ఈ సినిమాకు సంగీత దర్శకునిగా పని చేయడం పెద్ద చాలెంజ్‌లా అనిపించింది. పాటల కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను. సావిత్రిగారి పాత సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో సంగీత శైలి, ఆమె నటన ఎలా ఉన్నాయో పరిశీలించాను. సీతారామశాస్త్రిగారు లిరిక్స్‌ రాశారు. ఆయన నాకు హెల్ప్‌ చేశారు. ‘మహానటి’ నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాగ్‌ అశ్విన్‌ విజన్‌ సూపర్‌. ‘హ్యాపీడేస్‌’ లాంటి సినిమాలు కెరీర్‌లో ఒక్కసారే వస్తాయి. ప్రతి సినిమా ‘హ్యాపీడేస్‌’ అవ్వదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు