రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయానే.. అయితే ప్లాన్‌ బీ: ప్రియాంక చోప్రా

11 Sep, 2019 15:09 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ట్రైలర్‌ నిన్న విడుదలయ్యింది. షోనాలీ బోస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై.. 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ట్రైలర్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు చేసిన కామెంట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రైలర్‌లో ప్రియాంక, ఫర్హాన్‌ అక్తర్‌లు తమ కుమార్తె అనారోగ్యం గురించి చర్చిస్తూ.. వీలైనంత త్వరలోనే ఓ బ్యాంక్‌ను దోపిడి చేయాలి.. అలాగైతేనే తనకు వైద్యం చేయించగల్గుతాం అని మాట్లాడుకుంటారు.

ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘ప్రియాంక బ్యాంక్‌ దోపిడికి పాల్పడితే.. ఐపీసీ సెక్షన్‌ 393 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు’ అంటూ ట్విటర్‌లో ‘స్కై ఈజ్‌ పింక్‌’ టీమ్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ప్రియాంక వెంటనే స్పందిస్తూ.. ‘అరెరే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయాం కదా. అయితే ప్లాన్‌ బీని అమలు చేద్దాం’ అంటూ రీట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ల సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్‌ పింక్‌' సినిమాను ప్రదర్శించనున్నారు.

మరిన్ని వార్తలు