ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్‌

1 May, 2019 21:25 IST|Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ సందర్భంగా మహర్షి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి గెలవడమే అలవాటుగా ఉన్న ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్‌, ఇక్కడ ఏవడి బరువు వాడే మోసుకోవాలి, అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్‌ రిస్క్‌ చేయలేముగా, గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.., ఓడిపోతామనే భయంతో దిగితే ఎప్పటికీ గెలవలేం.. అంటూ మహేశ్‌ పలికే డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రిషి పాత్రలో మహేశ్‌ను మూడు డిఫరెంట్‌ షెడ్స్‌లో చూపించారు.
 

జీవితంలో గెలవడమంటే సంపాదించడమేనా? అని ప్రకాశ్‌ రాజ్‌, ఇప్పటి నుంచి ఓడిపోవడం అలవాటు చేసుకో అని జగపతిబాబు చెప్పే డైలాగులు కూడా సినిమాపై హైప్‌ను పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ చివర్లో మహేశ్‌ నాగలి పట్టుకుని ఉన్న సన్నివేశాల్ని చూపించారు. ఒకవైపు ఫన్నీగా, మరోవైపు కథపై ఆసక్తి పెంచేలా ట్రైలర్‌ సాగింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ మూవీని దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు