మహేశ్‌ ‘సర్కారు‌ వారి పాట’ ఇది ఫిక్స్‌

31 May, 2020 09:23 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ఈ శుభవార్త తెలిపారు. ఆదివారం ఉదయం 9.09గంటలకు తన సినిమా టైటిల్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. లీకువీరులు పేర్కొన్నట్టుగానే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. గీతా గోవిందం ఫేమ్‌ పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించబోతోంది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ఈ చిత్రంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. (మహేశ్‌ ఫ్యాన్స్‌కు ఈ రోజు ట్రిపుల్‌ ధమాకా)

ఇక ఈ టైటిల్‌ పోస్టర్‌లో మహేశ్‌ ఫుల్‌ లుక్‌ చూపించలేదు. వెనక నుంచి సూర్యుడి కాంతి, కాస్త రఫ్‌ లుక్, చెవికి రింగు, మెడపై రూపాయి కాయిన్‌ టాటూ  ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రేకిస్తోంది. ప్రస్తుతం టైటిల్‌ పోస్టర్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. గోపీసుందర్‌ మ్యూజిక్‌, పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తారని వార్తలు వచ్చిన్నప్పటికీ అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఫామ్‌లో ఉన్న తమన్‌వైపు చిత్ర బృందం మొగ్గు చూపింది. అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌ పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్‌ త్రిపాత్రాభినయం పోషించనున్నారనే వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. ఇక టైటిల్‌ ప్రకటించిన వెంటనే ‘సర్కారు వారి పాట’(#sarkaruvaaripaata) హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. 

>
మరిన్ని వార్తలు