నాలుగోసారి..!

14 Jul, 2014 00:10 IST|Sakshi
నాలుగోసారి..!

మహేశ్‌బాబు ఎంత వేగంతో స్టార్‌గా ఎదుగుతున్నారో, అంతే వేగంతో నటునిగా ఎదుగుతున్నారు. ఈ జనరేషన్‌లో ఎక్కువ శాతం అవార్డులు అందుకున్న క్రెడిట్ మహేశ్‌దే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరడజను నందులు మహేశ్ ఇంటికి చేరాయి. ఇప్పుడు నాల్గవసారి ఫిలింఫేర్ అవార్డును అందుకొని నేటి హీరోల్లో తనదైన పంథాను కొనసాగించారు మహేశ్. ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాలకు గాను ఇప్పటికే ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారాయన.
 
  ఇప్పుడు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి గాను మళ్లీ ఈ పురస్కారం ఆయన్ను వరించింది. శనివారం రాత్రి చెన్నయ్‌లో జరిగిన వేడుకలో మహేశ్ ఈ అవార్డు అందుకున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని పోచంపల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 6 నుంచి 18 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో మహేశ్, తదితరులపై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీనువైట్ల.
 
  ఈ షెడ్యూల్ అనంతరం వెంటనే..  18 నుంచి 25 వరకూ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో మహేశ్, శ్రుతీహాసన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తారు. ఈ నెలాఖరు నుంచి నార్వేలో మహేశ్, తమన్నాపై రెండు పాటల్ని తీస్తారు. మహేశ్ పుట్టినరోజైన ఆగస్ట్ 9న పాటలను, సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
 

>