మహేశ్ బ్రహ్మోత్సవం మొదలైంది

17 Sep, 2015 17:58 IST|Sakshi
మహేశ్ బ్రహ్మోత్సవం మొదలైంది

తిరుమలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా ‘బ్రహ్మోత్సవం’ మొదలైంది. కాకపోతే ఇది మహేశ్‌బాబు బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం షూటింగ్‌ను ఓ పాటతో మొదలు పెట్టారు. మహేశ్‌బాబు, ఇరవైఒక్క మంది నటీనటులతో ఓ సంగీత్ సాంగ్ చిత్రీకరిస్తున్నామని దర్శకుడు తెలిపారు.

ఈ పాట కోసం కళాదర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో 513 మందితో ఓ భారీ సెట్ తయారు చేయించామని, చాలా లావిష్‌గా తీస్తున్నామని పొట్లూరి ప్రసాద్ తెలిపారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో చేస్తున్న మరో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదనీ, స్టోరీ లైన్ అద్భుతంగా ఉందని మహేశ్‌బాబు చెప్పారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.