కంపెనీ సీఈఓగా...!

24 Sep, 2018 00:31 IST|Sakshi

అమెరికాలో ‘మహర్షి’ ప్రయాణం మొదలవ్వడానికి టైమ్‌ దగ్గర పడుతోంది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ కనిపిస్తారు. మహేశ్‌కు తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌  వచ్చే నెల 15న స్టార్ట్‌ అవుతుందని సమాచారం. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనుంది.

ఇందులో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. కానీ మహేశ్‌ క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉన్నాయని... ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేశ్‌ మరో షేడ్‌లో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈఓగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాలనే అమెరికాలో తీయబోతున్నారట ‘మహర్షి’ టీమ్‌. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ఈ షెడ్యూల్‌లోనే కంప్లీట్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్‌. ‘మహర్షి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హాలిడే కోసం మలేసియాలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు