అతిథి పాత్రలో మహేష్‌..!

15 Nov, 2018 13:06 IST|Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత సుకుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్‌ స్టార్‌.

ఈ సినిమాలతో పాటు ఓ చిన్న సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటించేందుకు కూడా మహేష్ ఆసక్తికనబరుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్, త్వరలో ఇతర హీరోలతో లో బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

ఈ ప్రొడక్షన్‌ వ్యవహారాలను మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటున్నారు. అయితే తొలి ప్రయత్నంగా ఓ ఎమోషనల్‌ డ్రామాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కనిపించే ఓ కీలక పాత్రను మహేష్ బాబుతో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట నమ్రత.

తమ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావటంతో మహేష్ కూడా గెస్ట్ అపియరెన్స్‌ ఇచ్చేందుకు ఓకె చెప్పే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి మహేష్ ఒప్పుకుంటాడా లేదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వార్తలు