ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా?

16 Nov, 2013 23:50 IST|Sakshi
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా?
రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ‘దూకుడు’ చేసిన హల్‌చల్ అంతా ఇంతాకాదు. ఆ సినిమా దెబ్బకు పాత రికార్డులన్నీ చెల్లా చెదురైపోయూయయి. మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిందా చిత్రం. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... ‘ఆగడు’పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఇటీవల లాంచనంగా జరిపారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. 
 
 దానికి కారణం మహేష్ ‘1’ సినిమా. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ‘ఆగడు’ షూటింగ్ కాస్త ఆగాల్సి వచ్చింది. ‘1’ షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో ఈ నెల 28న ‘ఆగడు’ పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం.
 
  ‘దూకుడు’లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు’లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.