‘మహర్షి’ పర్మిషన్ల రగడ

8 May, 2019 10:06 IST|Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు, అశ్వనిదత్‌, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా మీద ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్లాన్‌లో ఉంది చిత్రయూనిట్. ఎక్స్‌ట్రా షోస్‌ వేయటంతో పాటు టికెట్‌ రేట్లు పెంచేందుకు రెడీ అవుతుంది.

ఇప్పటికే ఎక్స్‌ట్రా షోస్‌ వేసుకునేందుకు, టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతులు వచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతోంది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి షోస్‌ వేసుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. కానీ కొన్ని థియేటర్లలో ఉదయం 7గంటల 30 నిమిషాల షోకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇక టికెట్‌ రేట్ల పెంపు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతున్నా పర్మిషన్‌కు సంబంధించిన పత్రాలను బయటపెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ రేటు పెంచేందుకు తాము అనుమతిచ్చినట్టుగా వచ్చిన వార్తలను ఖండించింది. మరి ఈ పరిస్థితుల్లో మహర్షి టీం క్లారిటీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు