పక్కా ప్రణాళిక

30 Sep, 2018 06:00 IST|Sakshi
మహేశ్‌బాబు

అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి సగం దూరం ప్రయాణించాడు రిషి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. రెండు పాటలను కూడా కంప్లీట్‌ చేశారు. అంటే రిషి ప్రయాణంలో సగం దూరం వచ్చేశాడన్నమాట. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ అక్టోబర్‌ 15న న్యూయార్క్‌లో స్టార్ట్‌ కానున్న సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్‌ దాదాపు 15 నుంచి 20 రోజులు ఉంటుంది. మహేశ్, పూజా, జయసుధలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. రెండు పాటలను కూడా షూట్‌ చేస్తారట. ఆ తర్వాత చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో నవంబర్‌ 10న స్టార్ట్‌ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ సినిమా పూర్తయ్యేంతవరకు సాగుతుందట. ఇలా పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు ‘మహర్షి’ అండ్‌ టీమ్‌. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు