ప్లాన్‌ మారిందా?

24 Feb, 2020 06:02 IST|Sakshi
మహేశ్‌బాబు

మహేశ్‌బాబు 27వ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నకు నిన్న మొన్నటివరకు దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు సమాధానంగా వినిపించింది. మహేశ్‌ 25వ చిత్రం ‘మహర్షి’కి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడన్న సంగతి తెలిసిందే. అయితే మహేశ్‌ 27వ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబోయేది వంశీ పైడిపల్లి కాదని, ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ ఈ అవకాశం దక్కించుకున్నారనే వార్త తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించనుంది.

ఇప్పటికే ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహేశ్, ఈ ఏడాదే మరో చిత్రాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకు తగ్గ సన్నాహాలు కూడా జరుగుతున్నాయని టాక్‌. మరి.. డైరెక్టర్‌ విషయంలో మహేశ్‌ ప్లాన్‌ మార్చారా? ఈ ఏడాది మహేశ్‌ హీరోగా నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. మరోవైపు పరశురామ్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇటీవల వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.

>
మరిన్ని వార్తలు