మహేశ్‌-పరుశురామ్‌ చిత్రం: ఊహకందని టైటిల్‌?

27 May, 2020 14:49 IST|Sakshi

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘గీతాగోవిందం’ ఫేమ్‌ పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని అందరూ భావించినా అది ఎందుకో కుదర్లేదు. ఇదే క్రమంలో పరుశురామ్‌ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేయమని డైరెక్టర్‌కు మహేశ్‌ సూచించాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన పరుశురామ్‌ లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా షూటింగ్‌ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మహేశ్‌-పరుశురామ్‌ల కాంబోలో వచ్చే చిత్ర టైటిల్‌ ఫిక్సయిందని సమాచారం. ‘సర్కార్‌ వారి పాట’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ను చిత్రబృందం ఫైనల్‌ చేసినట్లు, సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే (మే31) సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తన సినిమాలకు సంబంధించి టైటిల్స్‌పై మహేశ్‌కు కొన్ని నమ్మకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అప్పట్లో మూడు అక్షరాలతోనే తన సినిమా టైటిల్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకునేవారు. 

ఆ తర్వాత ఆ నమ్మకం నుంచి బయటపడి డిఫరెంట్‌ టైటిల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు ‘సర్కార్‌ వారి పాట’ టైటిల్‌ ఆప్ట్‌ అవుతుందని చిత్రబృందం చెప్పడం, మహేశ్‌కు కూడా ఈ టైటిల్‌ విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారని లీకువీరులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా గురించి అధికారిక సమాచారం రావాలంటే మే 31 వరకు ఆగాల్సిందేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ టైటిల్‌ తెగ వైరల్‌ అవుతోంది. చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి:
రాకేష్‌ మాస్టర్‌పై మాధవీలత ఫైర్‌
మరో రికార్డు క్రియేట్‌ చేసిన ‘అఆ’

మరిన్ని వార్తలు