‘ఆరోజు ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చే పనిలో మహేశ్‌’

8 May, 2020 14:47 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్ ‌బాబు ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో భారీ హిట్‌ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన‌ ఓ చిత్రం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అయితే ‘గీతా గోవిందం’ ఫేమ్‌ పరుశురామ్‌ చెప్పిన కథకు కనెక్ట్‌ అవ్వడంతో మహేశ్‌ తన 27వ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఈ క్లాస్‌ డైరెక్టర్‌కు అప్పగించారు. లాక్‌డౌన్‌ లేకుంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యేది. 

అయితే కరోనా ప్రభావం తగ్గాక సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే(మే 31) సందర్భంగా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కుదిరేలా లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఎదో ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఆలోచనలో మహేశ్‌ ఉన్నారని సమాచారం. పరుశురామ్‌ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు ఈ ప్రాజెక్ట్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌, మహేశ్‌ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌. అయితే కృష్ణ బర్త్‌డే రోజు అభిమానులకు బహుమతి అయితే ఉంటుంది కానీ ఏంటిదో చెప్పలేమని మహేశ్‌ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

‘గీతా గోవిందం’ తర్వాత పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. ‘సరిలేరు’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత మహేశ్‌ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మహేశ్‌ కోసం మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని పరుశురామ్‌ సిద్దం చేసినట్లు టాక్‌. ఇక ఈ సినిమాలో హీరో లుక్‌ మామూలుగా ఉండదని లీకువీరులు అంటున్నారు. హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ఖరారు కాలేదు. గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.  

చదవండి:
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్‌’

మరిన్ని వార్తలు