‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

2 Apr, 2020 16:59 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూ​ళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’  చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. 

ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్‌తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్‌ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్‌ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్‌కు 21.84 టీవీఆర్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను కొంత మంది ఫేస్‌బుక్‌లో కూడా అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారు. అయినప్పటికీ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గడిచిన పదిహేనేళ్లలో ఏ తెలుగు చిత్రానికి ఈ విధంగా టీవీఆర్‌ రాలేదని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు.
 
చదవండి:
‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’
ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

మరిన్ని వార్తలు