ఒకే ఫ్రేంలో మహేష్‌ ఫ్యామిలీ.. అభిమానులు ఫిదా

24 Oct, 2019 10:47 IST|Sakshi

సందేశాత్మక చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. అయితే కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్‌... ప్రచార ప్రకటనల్లోనూ అగ్ర స్థానంలోనే ఉన్నాడు. వరుస కమర్షియల్‌ యాడ్స్‌తో దూసుకుపోతున్నాడు. మహేష్‌బాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ అలాంటిది మరి. 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏకంగా సూపర్‌స్టార్‌ ఫ్యామిలితో ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో మహేష్‌తో పాటు అతడి భార్య నమ్రతా శిరోద్కర్‌, పిల్లలు గౌతం, సితారలు కూడా నటించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్న మహేష్‌... తమ కుటుంబమంతా కలిసి నటించడం ఇదే తొలిసారి అని.. ఇదో గొప్ప విశేషం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ అభిమానులు.. ‘ అందరూ ఒకే ఫ్రేమ్‌లో కన్నుల పండువగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కల నేటికి నెరవేరింది. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు తన సొంత దుస్తుల బ్రాండ్‌ కూడా ఓపెన్‌ చేసి పక్కా బిజినెస్‌మ్యాన్‌ అనిపించుకున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు