ప్రతి అడుగూ విలువైనదే

20 May, 2019 02:47 IST|Sakshi

కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో సంజయ్‌ దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘సడక్‌ 2’. మహేశ్‌భట్‌ దర్శకత్వంలోనే 1991లో వచ్చిన ‘సడక్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్‌ అయ్యారు ఆలియా. ‘‘సడక్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. మా నాన్నగారు (మహేశ్‌ భట్‌) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపారమైన, అందమైన, ఓ ఎమోషనల్‌ పర్వతాన్ని ఎక్కబోయే చిన్న ఎలుకగా నన్ను నేను ఊహించుకుంటున్నాను.

నేను ఈ పర్వత శిఖరాన్ని చేరుకోగలనని అనుకుంటున్నాను. ఇది అనుకున్నంత ఈజీ కాదని తెలుసు (తండ్రి డైరెక్షన్‌లో, సీనియర్స్‌తో కలిసి నటించడాన్ని ఉద్దేశించి). ఒకవేళ మధ్యలో నేను పడిపోతే తిరిగి పుంజుకోగలననే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం వేసే ప్రతి అడుగూ విలువైనదే’’ అని ఆలియా అన్నారు. తండ్రి మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ఆలియా. ఇక దాదాపు 20ఏళ్ల తర్వాత ‘సడక్‌ 2’ సినిమా కోసం మహేశ్‌ భట్‌ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. 1999లో వచ్చిన ‘కారతూష్‌’ చిత్రం తర్వాత మహేశ్‌ భట్‌ ఇంకో సినిమాకు దర్శకత్వం వహించలేదు.

మరిన్ని వార్తలు