ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!

3 Jul, 2016 23:17 IST|Sakshi
ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!

 ‘ఒక్కడు’, ‘పోకిరి’.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలను కోలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడీ స్టార్ హీరోలిద్దరితో ఒకే సినిమా తీయాలని తమిళ దర్శకుడు సుందర్.సి ప్రయత్నిస్తున్నారట. చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల రూపాయలు.
 
  సంగీతం సలచలనం ఏఆర్ రెహమాన్, ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్‌కణ్ణన్ తదితర హేమాహేమీలు ఈ సినిమాకి పనిచేయనున్నారు. అయితే.. ఇది మల్టీస్టారర్ సినిమా కాదు. తెలుగు వెర్షన్‌లో మహేశ్‌బాబు, తమిళ వెర్షన్‌లో విజయ్ హీరోలుగా నటిస్తే బాగుంటుందని దర్శకుడి ఆలోచన. ఈ ఇద్దర్నీ కలసి కథ కూడా వినిపించారని కోలీవుడ్ టాక్. మరి, హీరోలు అంగీకరించారో? లేదో? తెలియదు.
 
  హిందీలో కూడా తీస్తారట. బాలీవుడ్‌లో ఇంకా ఎవరికీ కథ చెప్పలేదు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ సంస్థకు ఇది నూరవ చిత్రం. దాంతో ఖర్చుకు వెనుకాడకుండా భారీగా నిర్మించాలనుకుంటున్నారు. తెలుగులో మహేశ్, తమిళంలో విజయ్ హీరోలుగా ‘3 ఇడియట్స్’ను రీమేక్ చేయాలని దర్శకుడు శంకర్ గతంలో ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఈసారి ఏం జరుగుతుందో!!