వెధవలు అయ్యేది మీరే.. పీకే ఫ్యాన్స్‌కు కత్తి కౌంటర్‌

16 Nov, 2017 14:23 IST|Sakshi

ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు, సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తికి మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య పవన్‌ కల్యాణ్‌పై మహేశ్‌ కత్తి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం.. దీంతో పీకే ఫ్యాన్స్‌ ఆయనపై నిప్పులు చెరుగుతూ దూషణలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌ కత్తి మరోసారి పవన్‌ అభిమానులకు చురకలంటించారు. మేం మేం బాగానే ఉంటాం.. మధ్యలో ఫ్యాన్సే వెధవలు అవుతారంటూ.. హైపర్‌ ఆదితో ఫొటో దిగి కామెంట్‌ పెట్టారు.

జబర్దస్త్‌లో భాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ అనేది ముందు పొట్ట, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’  అంటూ పరోక్షంగా ఇటీవల హైపర్‌ ఆది మహేశ్‌ కత్తిపై పంచులు విసిరిన సంగతి తెలిసిందే. ఈ పంచ్‌ డైలాగులు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్‌ మండిపడ్డారు. ’అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు... నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను.  నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు’ అంటూ మహేశ్‌ కత్తి ఘాటుగా రిప్లే ఇచ్చారు.

ఈ నేపథ్యంలో హైపర్‌ ఆదితో సరదాగా దిగిన ఫొటోను పోస్టుచేసిన మహేశ్‌ కత్తి.. తమ మధ్య ఉన్నవి సిద్ధాంతపరమైన విభేదాలే కాని, వ్యక్తిగత వైరాలు కాదని, పవన్‌ కల్యాణ్‌తో కూడా తాను నవ్వుతూ ఫొటో దిగినా దిగవచ్చునని, ఈ విషయంలో ఫ్యాన్స్‌ మేలుకోవాలని మహేశ్‌ కత్తి సూచించారు.

’కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!’ అని ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ కామెంట్‌పై పీకే ఫ్యాన్స్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు