మహేష్‌ సాయం.. ఆలస్యంగా...

18 May, 2018 16:59 IST|Sakshi
హీరో మహేష్‌ బాబు

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ఓ మంచి పని ఆలస్యంగా బయటకు వచ్చింది. పేద క్రీడాకారుల కోసం మహేష్‌ గత కొద్ది నెలలుగా సాయం చేస్తు‍న్నారు. ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్‌ అనే ఎన్జీవో మురికివాడల్లో ఉచిత వైద్య సేవలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం ఆర్థిక స్తోమత లేని  క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ఉచిత క్రీడా కేంద్రాన్ని నెలకొల్పింది. 

దీనికి మహేష్‌ బాబు-నమ్రతలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఆ కేంద్రానికి వాళ్లిద్దరూ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. భరత్‌ అనే నేను చిత్ర విడుదలకు ముందే ఇది జరిగింది. అయితే ఆ సమయంలో ప్రకటన చేస్తే చిత్ర ప్రమోషన్‌లా ఉంటుందన్న ఆలోచనతో ఫౌండేషన్‌ నిర్వాహకులు ఆగిపోయారు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గత కొద్ది నెలలుగా మహేష్‌ నమ్రతలు మా ఫౌండేషన్‌కు సాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న ఆ దంపతుల ఆలోచనకు హ్యాట్సాఫ్‌. వారి ప్రొత్సహం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు హరీష్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు