పాత్ర కోసం బరువు పెరుగుతున్న మహిమా చౌదరి!

5 Aug, 2013 01:52 IST|Sakshi
పాత్ర కోసం బరువు పెరుగుతున్న మహిమా చౌదరి!
‘పర్‌దేశ్’ చిత్రం ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన మహిమా చౌదరి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ‘మనసులో మాట’తో తెలుగు తెరపై తళుక్కుమన్నారు మహిమ. ఆ తర్వాత తెలుగులో చేయనప్పటికీ హిందీ చిత్రాల్లో మాత్రం యాక్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆమె అక్కడ కూడా కనుమరుగయ్యారు. బాబీ ముఖర్జీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారామె. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. కాగా, బాబీతో మహిమాకి మనస్పర్థలు ఏర్పడ్డాయనే వార్త ఉంది. 
 
 అదలా ఉంచితే.. మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు మహిమ. గ్యాంగ్‌స్టర్‌గా మారిన నటి అర్చనాశర్మ జీవితం ఆధారంగా శశి రంజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో అర్చనాశర్మ పాత్రకు మహిమ అయితే బాగుంటుందనుకున్నారు రంజన్. 
 
 ఈ చిత్రకథ, పాత్ర విని ఎగ్జయిట్ అయిన మహిమ మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపేశారట. ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించాలి కాబట్టి ఎనిమిది నుంచి పది కిలోలు బరువు పెరగడానికి కూడా అంగీకరించేశారని సమాచారం. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను రాహుల్‌దేవ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ముంబయ్, దుబాయ్, నేపాల్‌లో షూటింగ్ జరిపారు. తదుపరి షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తారు.