ప్రతి భారతీయుడు గర్వపడతాడు

5 Jul, 2020 05:46 IST|Sakshi

– అజయ్‌ దేవగన్‌     

‘‘ఆధునిక భారతీయ ఫుట్‌బాల్‌కి ఆద్యుడు సయ్యద్‌ అబ్దుల్‌ రహీం గొప్పతనం గురించి మా ‘మైదాన్‌’ సినిమాలో చూపించబోతున్నాం. ఫుట్‌బాల్‌ కోచ్‌గా 1950లో ఆయన ప్రస్థానం ప్రారంభమయింది. అప్పటినుండి 1963లో చనిపోయేంత వరకు ఆయన ఫుట్‌బాల్‌ కోచ్‌గా వ్యవహరించారు’’ అన్నారు అజయ్‌ దేవగన్‌. సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్‌’లో అజయ్‌ దేవగన్‌ సయ్యద్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి అజయ్‌ దేవగన్‌ మాట్లాడుతూ– ‘‘వచ్చే ఏడాది ఇండిపెండెన్స్‌ వారాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక రియల్‌ హీరో స్టోరీని భారతీయులందరూ గర్వపడేలా తీస్తున్నాం.

ఆగస్టు 13న ‘మైదాన్‌’ను విడుదల చేస్తాం’’ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాలి. ఈ స్పోర్ట్స్‌ డ్రామాను తెరకెక్కించటానికి 16 ఎకరాల విస్తీర్ణంలో ఓ సెట్‌ను మేలో నిర్మించారు. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలకి ఈ సెట్‌ పాడయిపోయింది. మళ్లీ ఆ సెట్‌ను నిర్మించాలంటే రెండు నెలలు పడుతుంది. ఆ సెట్‌ పూర్తి చేసి, సెప్టెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘బదాయి హో’ ఫేం రవీంద్రనా«థ్‌ శర్మ దర్శకుడు. ఫ్రెష్‌లైమ్‌ ఫిల్మ్‌ సహకారంతో బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, అరునవ్‌ సేన్‌ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.

మరిన్ని వార్తలు