శ్రీరాం హీరోగా పైసా

1 Apr, 2016 04:04 IST|Sakshi
శ్రీరాం హీరోగా పైసా
డబ్బు డబ్బు డబ్బు ఈ రెండక్షరాల చుట్టూనే కాలం తిరుగుతోందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా డబ్బే లోకంగా భావిస్తున్న మనిషికి అవసరాలకు మించిన డబ్బు వరమా? శాపమా? అన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం పైసా అంటున్నారు ఆ చిత్రం దర్శకుడు అబ్దుల్ మజీద్. ఇంతకు ముందు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని రూపొందించిన ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పైసా.
 
  కాన్ఫిడెంట్ ఫిలిం కబే, కేజేఆర్ స్టూడియోస్, ఆర్‌కే.డ్రీమ్ వరల్డ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరాటే కే.ఆనంద్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పసంగ, గోలీసోడా వంటి జాతీయ అవార్డు చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆరా అనే నవ నటి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాజర్, మైయిల్‌సామి, మధుసూదన్,రాజసింహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
  ఒక కీలక పాత్రలో నటుడు సెన్రాయన్ నటిస్తున్నారు. కేపీ.వేల్‌మురుగన్ చాయాగ్రహణం, జేవీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మనిషికి డబ్బు అవసరమే. అయితే అదే జీవితం అయితే నరకమే మిగులుతుంది అని చెప్పే చిత్రం పైసా అని తెలిపారు. నిజ జీవిత అనుభవాలే తన చిత్రం అని దర్శకుడు అబ్దుల్ మజీద్ అన్నారు. తన చిత్రం సగటు ప్రేక్షకుడొక్కడిలో మార్పు తీసుకొచ్చినా తన ప్రయత్నం ఫలించినట్లేనని ఆయన అన్నారు.