ఆత్మరక్షణ విద్యల్లో నాయికలు

27 Jan, 2020 07:22 IST|Sakshi
మాళవికమోహన్‌

సినిమా: ఇప్పుడు కథానాయికలు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతున్నారు. ఒకప్పుడు అందాలారబోతకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు వేరే లెవల్‌ అంటున్నారు. ఆ మధ్య నటి అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో నటించడానికి గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి విద్యలో శిక్షణ పొందింది. అదే విధంగా ఇటీవల నటి స్నేహ కూడా పటాస్‌ చిత్రం కోసం తమిళుల ప్రాచీన విలువిద్య అడిమురై అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొంది నటించారు. ఈ చిత్రం స్నేహకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా సంచలన నటిగా ముద్ర వేసుకున్న అమలాపాల్‌ తాజాగా అదో అంద పరవై పోల చిత్రంలో నటించింది.

ఇది హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం. ఈ చిత్రం కోసం అమలాపాల్‌ గ్రామిక అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొంది నటించింది. ఈ చిత్రం పిబ్రవరి 14న తెరపైకి రానుంది. ఇకపోతే మరో మలయాళ నటి మాళవికమోహన్‌ కూడా ఇప్పుడు యాక్షన్‌ హీరోయిన్‌ అవతారమెత్తింది. ఈ అమ్మడు ఇళయదళపతి విజయ్‌కు జంటగా మాస్టర్‌ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఇందులో నటి మాళవికమోహన్‌కు ఫైట్స్‌ ఉన్నాయట. దీని కోసం పర్కలర్‌ అనే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతోందని తెలిసింది. ఇకపోతే ఇదే చిత్రంలో నటి ఆండ్రియా నటిస్తోంది. ఈమెకు కూడా చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదలకు సిద్ధం అవుతోంది. మొత్తం మీద హీరోయిన్‌ ఇప్పుడు యాక్షన్‌కు మారడంతో పాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ ఆరితేరుతున్నారన్నమాట.

మరిన్ని వార్తలు