అఘాయిత్యం కేసు: మౌనం వీడిన హీరోయిన్

1 Mar, 2017 11:40 IST|Sakshi
అఘాయిత్యం కేసు: మౌనం వీడిన హీరోయిన్

కోచి: ఇటీవల కిడ్నాప్‌, లైంగిక వేధింపులకు గురైన మలయాళీ నటి మౌనం వీడింది. తనపై జరిగిన దాడి గురించి సోషల్ మీడియాలో స్పందించింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

'కొన్ని నిమిషాల పాటు జీవితం ఆగిపోయినట్టు అనిపించింది. నేనెప్పుడూ ఊహించని సంఘటన ఎదురైంది. బాధలు, పరాజయాలు ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడూ ఎదురొడ్డి నిలబడతాను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ తన ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు.

ఈ నెల 17న కోచి వెళ్తున్న మలయాళీ నటిని కొందరు కిడ్నాప్ చేసి, దాదాపు 2 గంటలు కారులో బందీగా తిప్పుతూ లైంగికంగా వేధిస్తూ ఫొటోలు, వీడియోలు తీసిన సంఘటన కేరళలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నిందితుడు పల్సర్ సునీతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.