ప్రముఖ మళయాల డైరెక్టర్ మృతి

27 Feb, 2016 13:38 IST|Sakshi
ప్రముఖ మళయాల డైరెక్టర్ మృతి

ట్రాఫిక్, మిలి లాంటి ఎమోషనల్ సినిమాలతో సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాల దర్శకుడు రాజేష్ పిళ్లై (41) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. సినిమానే జీవితంగా బతికిన ఆయన ఈ శుక్రవారం రిలీజ్ అయిన వేట్టా సినిమా కోసం ఆపరేషన్ వాయిదా వేసుకోవటంతో పరిస్థితి విషమంగా మారి శనివారం మృతి చెందారు.

రాజేష్ పిళ్లై గతంలోనే కాలేయమార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉన్నా, వేట్టా సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ వాయిదా వేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు సన్నిహితులు తెలిపారు. ఇటీవల కాలంలో చాలాసార్లు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుప్రతిలో చేరిన ఆయన, కొచ్చి లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11.45 నిమిషాలకు మరణించారు.

అవయదానం నేపథ్యంలో రాజేష్ పిళ్లై తెరకెక్కించిన ట్రాఫిక్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సాధించింది. మళయాలలో తెరకెక్కిన ఈ సినిమా తరువాత తమిళ, హిందీ, తెలుగు భాషల్లోనూ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.