‘‘మా అబ్బాయి అనురాగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపారంలో నాకు తోడుగా ఉండేవాడు. రామానాయుడులో యాక్టింగ్ కోర్స్ చేసి సినిమాల్లో నటిస్తాను అన్నాడు. వాడి కలను నిజం చేయడానికే ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు కె. కోటేశ్వరరావు. అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోహీరోయిన్లుగా హేమంత్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ఒక కథ అనుకొని ఒక నిర్మాతతో నా దగ్గరకు వచ్చాడు అనురాగ్.
కొన్ని కారణాల వల్ల ఆ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. అందుకే నేనే నిర్మించాను. మావాడు చిన్నప్పటి నుంచి అన్నింట్లో చురుకుగా ఉండేవాడు. మాకు ఈ ఫీల్డ్తో సంబంధం లేకపోయినా వాడి మీద నమ్మకంతో వచ్చాం. స్టూడెంట్ లైఫ్కి సంబంధించిన యూత్ఫుల్ కథ ఇది. దర్శకుడు చాలా ఆసక్తికరంగా సినిమాను మలిచారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అందరూ మళ్లీ మళ్లీ చూసేలా మా సినిమా ఉంటుంది. హీరోగా అనురాగ్కు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. మా బ్యానర్పై వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. రెండు, మూడు కథలు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు.