వైఎస్‌గారి పాత్ర చేయడం నా అదృష్టం

16 Feb, 2019 02:30 IST|Sakshi
విజయ్‌ చిల్లా, సహస్ర, మొయినుద్దీన్, దయానంద్, ‘దిల్‌’ రమేశ్, మమ్ముట్టి, ఉమ, అశ్రిత, మహి. వి రాఘవ్, శ్రీమిత్ర చౌదరి

– మమ్ముట్టి

‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్‌ టచ్‌ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్‌ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు.

మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్‌లో నిర్వహించిన ‘బ్లాక్ట్‌బస్టర్‌ మీట్‌’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్‌కు జాగ్రత్తగా డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను.

తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్‌గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఫస్ట్‌ సాంగ్‌ షూట్‌ చేశాం. ఆ తర్వాత ఓ సీన్‌ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్‌గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్‌ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్‌ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్‌ కంఫర్ట్‌ లెవల్స్‌ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను.

సెట్‌లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్‌ పలకడానికి సహకరించిన అసోసియేట్‌ డైరెక్టర్స్‌తో పాటు టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్‌ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్‌ లేదు.. ఫైట్స్‌ లేవు.. పాటలు, కామెడీ సీన్స్‌ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు.  సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి.

విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్‌ఆర్‌గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్‌ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా.  ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది.

సినిమా రిలీజ్‌ అయ్యాక కొన్ని వేల ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్‌ఆర్‌గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్‌ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్‌గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్‌ టు మమ్ముట్టిసార్‌.. వైఎస్‌గారిని మళ్లీ తీసుకొచ్చారు.

సినిమా రిలీజ్‌ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్‌ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్‌.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు.   దర్శకుడు మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్‌గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్‌గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్‌ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది.

అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్‌ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్‌.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్‌ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్‌లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను  అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్‌. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు.

ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్‌ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్‌గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్‌గోపాల్‌వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్‌’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర,  శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు