అడవిలో ఏం జరిగింది?

27 Dec, 2017 00:59 IST|Sakshi
రఘువీర్, శిరీష దాసరి, వైవీఎస్‌ చౌదరి, చంద్రబోస్, సదా చంద్ర, ఎస్వీ రమణ

సాయి సంహిత క్రియేషన్స్‌ పతాకంపై యస్వీ రయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన్యం’. రఘువీర్, శిరీష దాసరి, ‘బాహుబలి’ ప్రభాకర్, వర్ష ముఖ్య తారలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ఆడియో  సీడీని దర్శక–నిర్మాత వైవీయస్‌ చౌదరి విడుదల చేసి మొదటి సీడీని పాటల రచయిత చంద్రబోస్‌కి అందించారు. హీరో రఘువీర్‌ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదిక్‌ మెడిసన్‌ చదివే మెడికోలు ఎప్పుడూ ఏదో ఒక మందు కనుక్కోవాలి. అలా కనుక్కొని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. అలాంటి పాత్రను ఇందులో చేస్తున్నాను.

ఆ మందు కనిపెట్టే ప్రాసెస్‌లో నా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? దెయ్యం రూపంలో మాకు ప్రమాదం సంభవిస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి? ఆ కష్టాల నుండి  ఎంతమంది బయటపడ్డాం? ఎంతమంది చనిపోయారు. అసలు దెయ్యం ఉందా, లేదా?’’ అనేది కాన్సెప్ట్‌’’ అన్నారు. ‘‘రమణ చాలా నిబద్ధత కలిగిన దర్శకుడు. హీరో రఘువీర్‌కు మంచి భవిష్యత్‌ ఉంది’’ అన్నారు వైవీయస్‌ చౌదరి. చంద్రబోస్‌ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లో మొదటిసారి ఈ సినిమాలో ‘చినుకల్లే కురిసింది’ అనే పాట పాడాను. ఈ పాట నేనే రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సదాచంద్ర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: పి.కోమలీదేవి, మేముల సత్యనారాయణ.

మరిన్ని వార్తలు