నిజమైన ప్రేమకు నిర్వచనం!

12 Jul, 2015 23:11 IST|Sakshi
నిజమైన ప్రేమకు నిర్వచనం!

 ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్.వి.రంగారావు లాంటి అగ్రనటుల చిత్రాల్లో  న టించి, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి కన్నాంబను మర్చిపోవడం అంత సులువు కాదు. ఇప్పుడామె మనవడు పసుపులేటి  నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పవన్ అగర్వాల్, బిందు బార్బీ జంటగా కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఆయన ‘మనసంతా నువ్వే’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
 తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి పాటలను విడుదల చేశారు. ‘‘సినిమాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల సినిమాల్లో మంచిని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నిర్మాత  మాట్లాడుతూ -‘‘దర్శకుడు అనుకున్న విధంగా చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ  నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని చెప్పారు. ‘‘నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పే సినిమా ఇది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీఖాన్, సంతోష్‌కుమార్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.