మహేశ్‌ ఇంప్రెస్‌ అయ్యాడు – మంజుల

10 Feb, 2018 00:58 IST|Sakshi
∙పి.కిరణ్, సాయిమాధవ్, సంజయ్, మంజుల, సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్‌

‘‘నేను డైరెక్షన్‌ చేస్తున్నానంటే మహేశ్‌ నమ్మలేదు. టీజర్స్, సాంగ్స్‌ చూసి షాక్‌ అయ్యాడు. వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేటప్పుడు ఈ సినిమా చూసి ఇంప్రెస్‌ అయ్యాడు’’ అన్నారు మంజుల. సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్‌ స్వరూప్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా  మంజుల మాట్లాడుతూ–‘‘ఏదో ఓ సినిమా డైరెక్ట్‌ చేయాలని ఈ సినిమా డైరెక్ట్‌ చేయలేదు.

మంచి విషయం ఉండబట్టే చేశాను. బేసిక్‌గా నేను రొమాంటిక్‌ పర్సన్‌ను. అందుకే ఓ స్వీట్‌ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ఈ సినిమా చూసి కెమెరామేన్‌ ఛోటాగారు బెస్ట్‌ లవ్‌ స్టోరీ అన్నారు. కథను ముందు కిరణ్‌గారికి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ సాయంత్రమే సాయిమాధవ్‌ బుర్రాకి చెప్పాను. ఆయనకూ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా ఆయన (సంజయ్‌)  స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆయన లక్కీ యాక్టర్‌. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. మా అమ్మాయి కూడా మంచి రోల్‌ ప్లే చేసింది. సందీప్, అమైరా బాగా చేశారు.

నా దగ్గర పవన్‌ కల్యాణ్‌ కోసం మంచి కథ ఉంది. ఆయనకు పర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతుంది. ఆ ఒక్క సినిమా చేసి రాజకీయాల్లోకి వెళ్లొచ్చు’’ అన్నారు.‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసే అందమైన చిత్రం. ఇందులో ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని ఒక ఇంట్రస్టింగ్‌ మెసేజ్‌ ఉంటుంది. ఇది ఏ జానర్‌ సినిమా అని ఒక ఫ్రెండ్‌ అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఒక మంచి కాఫీలాంటి సినిమా అవుతుంది అనిపించింది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అన్నారు సందీప్‌ కిషన్‌.

‘‘మంజుల కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్‌ అంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చుతుందని ఈ సినిమా తీశాం. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నాం’’ అన్నారు  పి.కిరణ్‌. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే కథ. అందరికీ నచ్చే డైలాగ్స్‌ రాశాను. మంజులగారు క్లారిటీతో, మనసుకు హత్తుకునేలా రాయించుకున్నారు’’ అన్నారు బుర్రా సాయిమాధవ్‌.  ‘‘సినిమా చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా తీసిన మంజులకు నా కంగ్రాట్స్‌. కిరణ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సంజయ్‌ స్వరూ‹ప్‌. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా.

మరిన్ని వార్తలు