మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం..!

8 Aug, 2017 10:54 IST|Sakshi
మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం..!

 విలన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన నటుడు  మంచు మోహన్ బాబు. నటుడిగానే కాక నిర్మాతగానూ ఘన విజయాలు సాధించిన ఈ కలెక్షన్ కింగ్ వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్నలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు వీరంతా నటులుగా కొనసాగుతున్నారు.

ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతోంది. గతంలో మనోజ్ కూడా బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించాడు. అదే బాటలో లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ తెరంగేట్రానికి రంగం సిద్ధం మవుతోంది. అశ్వనిదత్ కూతురు ప్రియాంక దత్ నిర్మిస్తున్న మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్రను నిర్వాణతో చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్వని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత, దుల్కర్ సల్మాన్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి మూడోతరం నటులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. టాలీవుడ్ సర్కిల్స్ ఈ వార్త గట్టిగానే వినిపిస్తోంది.