పవర్‌ఫుల్‌గా దూసుకెళ్తా

26 Sep, 2013 01:16 IST|Sakshi
పవర్‌ఫుల్‌గా దూసుకెళ్తా
మంచు విష్ణు గమ్యం వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తాజాగా చేసిన ‘దూసుకెళ్తా’ చిత్రం సర్వహంగులతో సిద్ధమవుతోంది. ఈ నెల 28న టైమ్స్ మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేయబోతున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిందాస్’, ‘రగడ’ ఫేమ్ వీరు పోట్ల ఈ సినిమాకు దర్శకుడు.
 
‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ తరహాలోనే పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు చెబుతున్నారు. 
 
ఇందులో విష్ణు పాత్ర చిత్రణ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విష్ణు కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మోహన్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆర్.విజయకుమార్.