ముంబై చీప్‌ సిటీ కాదు.. నాకు ఇల్లు లేదు: నటి

10 Jun, 2020 19:39 IST|Sakshi

ఇండస్ట్రీలో ప్రతి రోజూ సవాలుతో కూడుకున్నదేనని.. ఒక్కసారి బ్రేక్‌ తీసుకుంటే మళ్లీ అక్కడ స్థానం సంపాదించడం అంత సులువు కాదన్నారు బాలీవుడ్‌ నటి మందనా కరిమి. గ్లామర్‌ ఫీల్డ్‌లో అడుగుపెట్టాలని చాలా మంది కలలు కంటారని.. అయితే ఒత్తిడిని తట్టుకుంటేనే నెగ్గుకురాగలమనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా అవకాశాలు లేక తాను ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నారు. ఒక్కరాత్రిలోనే తన జీవితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తెరకు దూరమైన మందన జీ5 షో ది కాసినో ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. జూన్‌ 12 విడుదల కానున్న ఈ షోలో కరణ్‌వీర్‌ బోహ్రా, సుదాంశు పాండే వంటి టీవీ స్టార్లు నటించారు. (చిన్న వయస్సులోనే నిర్ణయం తీసుకున్నా: భూమి)

ఈ క్రమంలో తన పునరాగమనం గురించి మందన జూమ్‌తో మాట్లాడుతూ.. ‘‘ ఇండస్ట్రీలో మన స్థానం పదిలంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతీ రోజూ ఓ కొత్త సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేసే వీలు ఉంటుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఇంకో విషయం ముంబైలో బతకడం చాలా కష్టం. ఇక్కడ ప్రతీదీ ఖరీదైనదే. ఇప్పుడు నాకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. నేను చాలా కుంగిపోయాను. అయితే నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలబడుతున్నారు. వారి ప్రోత్సాహంతోనే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. చేదు అనుభవాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి పారిపోవాలనుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఆలోచన మారింది. మనల్ని మళ్లీ పిలిచినపుడు వెళ్లడంలో తప్పు లేదనిపించింది’’అని చెప్పుకొచ్చారు. కాగా మందన రియాలిటీ షో బిగ్‌బాస్‌తో పాటుగా క్యా కూల్‌ హై హమ్‌ 3 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారంటూ వార్తలు ప్రచారం కాగా.. తనకు వైరస్ సోకలేదని పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు.‌(నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి)

మరిన్ని వార్తలు