గోవాలో తొలి అడుగు!

26 Nov, 2017 01:16 IST|Sakshi

హిట్టూ, ఫ్లాపు, వసూళ్లు వంటి వర్డ్స్‌ను పక్కన పెడితే దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమాలు రత్నాలని ప్రేక్షకులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో అంత కంటెంట్‌ ఉంటుందన్నది వారి అభిప్రాయం. అందుకే మణిరత్నం సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తుంటారు. మణిరత్నం కూడా త్వరలో సినిమా చూపించే పని మీదే ఉన్నారు. మల్టీస్టారర్‌ మూవీకి ఆయన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ గోవాలో జరుగుతున్నాయి. అంటే.. సినిమాకు గోవాలో తొలి అడుగు వేశారన్నమాట.

విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి, జ్యోతిక, ఐశ్యర్యా రాజేశ్, ఫాహద్‌ ఫాజిల్, శింబు ముఖ్య పాత్రల్లో రూపొందనున్న చిత్రమిది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్త. ‘‘మణిరత్నం, ఏఆర్‌. రెహమాన్, రచయిత వైరముత్తు కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మెగా మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ సాంగ్‌ కంపోజిషన్స్‌ గోవాలో జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు విజయ్‌ సేతుపతి. ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో మొదలు పెట్టనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... కోలీవుడ్‌లో శింబూపై కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో అతను కొత్త సినిమాలేవీ ఒప్పుకోకూడదనే నిబంధన ఉన్నట్లు సమాచారం. దాంతో శింబు స్థానంలో మలయాళ నటుడు నివిన్‌ పౌలీని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని చెన్నై టాక్‌. ఈ విషయంపై  ఆఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు