మన మనీషా కొయిరాలానే ఇలా..!

24 Jul, 2013 03:01 IST|Sakshi
మన మనీషా కొయిరాలానే ఇలా..!
‘‘టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా... మల్‌బార్ మెరుపులు మెరిసే దానా... డిజిటల్‌లో చెక్కిన స్వరమా... ఎలిజిబెత్ టేలర్ తరమా... జాకిర్‌హుస్సేన్ తబలా నువ్వేనా...’’ అంటూ పద్దెనిమిదేళ్ల క్రితం యువతరంతో కితాబులందుకున్న అందమది. కానీ ఇప్పుడు ఆ అందం కళా విహీనమై పోయింది. హదయం ద్రవించుకుపోయే విషాదం ఇది. 
 
 ఇక్కడున్న ఫొటోని చూశాక... ఈ అక్షరాలు ఎవర్ని ఉద్దేశించి రాసినవో అర్థమయ్యే ఉంటుంది. తన అందంతో, అభినయంతో ఊర్రూతలూగించిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు, క్రిమినల్, ప్రేమతో, బాబా... ఈ సినిమాలు చాలు దక్షిణాదిన మనీషా ఏంటో చెప్పడానికి. అలాంటి అందం ఒక్కసారి కనుమరుగైపోవడం అమె అభిమానులనే కాదు, సగటు సినీ ప్రేక్షకుణ్ణి కూడా బాధిస్తున్న అంశం.
 
 కష్టాలు అనేవి మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలాగే కొనసాగుతుంటాయనడానికి మనీషా జీవితమే ఓ నిదర్శనం. పెళ్లి అనంతరం భర్తతో విబేధాలు తలెత్తడంతో వైవాహిక జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలికేశారు మనీషా. నటిగానో, నిర్మాతగానో మళ్లీ పరిశ్రమలో కొనసాగుదాం.. అనుకునేలోపు... ఓవేరియన్ క్యాన్సర్ మహమ్మారి ఉచ్చులో చిక్కుకొని దాదాపుగా చావుకు దగ్గరయ్యారు. 
 
 న్యూయార్క్ వెళ్లి అక్కడ కేన్సర్‌తో పోరాటం చేసి, ఎలాగోలా గెలిచి బయటపడ్డారు. ఈ కష్టాలన్నీ కలిసి మనీషాకు ఇష్టంగా ఇచ్చిన బహుమతే... ఈ ఆకారం. 42 ఏళ్ల మనీషా కాస్తా... 62 ఏళ్ల మనీషాగా మారిపోయారు. కేన్సర్ చికిత్స కారణంగా విలువైన తన కురులను కోల్పోయి ఇలా అంద విహీనంగా తయారయ్యారు. కానీ... మనీషా మాత్రం ఆత్మసై ్థర్యాన్ని వదలలేదు. తన తాజా ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి... కేన్సర్‌ని జయించిన ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఏమైనా మనీషా నిజంగా గ్రేట్.