విశాల్‌కు జంటగా మంజిమామోహన్

3 Jul, 2016 02:50 IST|Sakshi
విశాల్‌కు జంటగా మంజిమామోహన్

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఘన విజయాలను సాధించిన ఎందిరన్, బాహుబలి చిత్రాలకు సీక్వెల్స్ నిర్మాణంలో ఉన్న విషయం గుర్తు చేయాల్సిన అవసరం లేదు.అదే కోవలో సండైకోళి పార్టు-2 తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది. విశాల్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం సండైకోళి. మీరాజాస్మిన్ నాయకిగా నటించిన ఆ చిత్రంలో రాజ్‌కిరణ్ విశాల్‌కు తండ్రిగా ముఖ్యపాత్రను పోషించారు. లింగసామి దర్శకత్వం వహించిన సండైకోళి చిత్రం 2005లో విడుదలై పెద్దవిజయాన్నే సొంతం చేసుకుంది.
 
  సుమారు 11 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి సండైకోళి-2 చిత్రం రెండేళ్ల క్రితమే ప్రారంభం కావలసింది. అప్పట్లో దర్శకుడు లింగసామి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనడం, నటుడు విశాల్‌తో భేదాభిప్రాయాలు వంటి కారణాలతో చిత్రం వాయిదా పడింది. అసలు జరుగుతుందా? ఆగిపోతుందా? అన్న మీమాంస పరిస్థితుల్లో ఇటీవల లింగుసామి, విశాల్‌ల మధ్య పొరపొచ్చాలు తొలగిపోవడంతో సండైకోళి-2 చిత్రం పట్టాలెక్కనుంది.
 
 సండైకోళి చిత్రంలో నాయకిగా నటించిన మీరాజాస్మిన్ పార్టు-2లోనూ నటించనున్నారు.అయితే ఇందులో విశాల్‌ను కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుని సంసారం చేసే స్త్రీగా నటించనున్నట్లు సమాచారం. ఇక రాజ్‌కిరణ్ విశాల్ తండ్రిగానే నటించనున్నారట. ఇకపోతే ఇందులో కథానాయకి కోసం చాలా మందిని అనుకున్నా చివరికి మలయాళ లక్కీగర్ల్ మాం. మంజిమామోహన్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తాజా సమాచారం.
 
 ఈ బ్యూటీ ఇప్పటికే శింబు సరసన అచ్చయంబదు మడమయడా చిత్రంలో నటించారు. ప్రస్తుతం ముడి సూడామన్నన్ చిత్రంలో నటిస్తున్న మంజిమామీనన్ త్వరలో విష్ణువిశాల్‌తో ఒక చిత్రంలో నటించనున్నారు.ఇక నాగచైతన్యకు జంటగాా సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నటిస్తూ అటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా సండైకోళి-2లో విశాల్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
 
  దర్శకుడు లింగుసామి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్‌తో తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని తరువాతనే సండైకోళి-2 పై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. అదే విధంగా విశాల్ ప్రస్తుతం కత్తిసండై, తుప్పరివాలన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే సండైకోళి-2లో నటించే అవకాశం ఉంది.