‘సాహో’ టాక్‌‌.. ఆ సెంటిమెంట్లే కారణమా!

31 Aug, 2019 12:20 IST|Sakshi

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్ సాహో. యూవీ క్రియేషన్స్‌ సంస్థ సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ మూవీకి డివైడ్‌ టాక్‌ రావటంపై అభిమానులు రకరకాల కారణాలు చెపుతున్నారు.
(మూవీ రివ్యూ : ‘సాహో’)

రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు తదుపరి చిత్రాలు పెద్దగా కలిసి రావన్న సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో బలంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్‌ నెంబర్‌ 1, సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించాడు తారక్‌, అయితే ఆ సినిమాల తరువాత ఎన్టీఆర్‌కు వరుసగా సుబ్బు, ఆంద్రావాలా, కంత్రీ లాంటి భారీ డిజాస్టర్లు వచ్చాయి.

మగధీర లాంటి భారీ హిట్ తరువాత రామ్‌చరణ్‌కు కూడా ఆరెంజ్‌ లాంటి డిజాస్టర్‌ ఎదురైంది. విక్రమార్కుడు సినిమా తరువాత రవితేజ కూడా ఖతర్నాక్‌ సినిమాతో నిరాశపరిచాడు. గతంలో రాజమౌళితో కలిసి ఛత్రపతి సినిమా చేసిన ప్రభాస్‌కు తరువాత పౌర్ణమి సినిమాతో షాక్‌ తగిలింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తరువాత చేసిన సాహోకు కూడా నెగెటివ్‌ వస్తుండటంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది.
సాహో ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజమౌళి, ప్రభాస్‌

అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్‌లుగా నిలిచాయి. అస్త్రం, శక్తి, పంజా లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు జాకీ. ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ కావటంతో ఈ నటుడిపై ఐరన్‌ లెగ్ ముద్ర వేశారు. పంజా తరువాత తెలుగు సినిమాల్లో నటించని జాకీని సాహో కోసం తీసుకొచ్చారు చిత్రయూనిట్.
జాకీ ష్రాఫ్‌ (ఫైల్‌ ఫోటో)

దీంతో సినిమాకు నెగెటివ్ టాక్‌ రావటానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు ఫ్యాన్స్‌. దీనికి తోడు టాలీవుడ్లో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్‌ కూడా ఉంది. దాదాపు టాలీవుడ్ దర్శకులంతా రెండో సినిమాతో నిరాశపరిచారు. అందుకే సుజీత్ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ నిజమౌతుంది అన్న ప్రచారం జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు