మళ్లీ దుమ్మురేపుదామా..

5 Feb, 2015 02:46 IST|Sakshi
మళ్లీ దుమ్మురేపుదామా..

నటి తమన్నకిప్పుడు అవకాశాలు కావాలి. అలాగే అర్జెంట్‌గా ఒక విజయం అవసరం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టేసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం ఈ మూడు భాషల్లోనూ అవకాశాలు పలచబడ్డాయి. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టాలని ఆశ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో అజిత్ తాజా చిత్రానికి రెడీ అవుతుండడం, ఆ చిత్రానికి శివ దర్శకత్వం వహించనుండడంతో తమన్న ఈ చిత్రంపై కన్నేశారు.

కారణం ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వీరం వంటి విజయవంతమైన చిత్రం తెరకెక్కడమే.  శివ దర్శకత్వంలో తమన్న చిరుతై చిత్రంలో కార్తీ సరసన నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. దీంతో అజిత్ తాజా చిత్రంలో అవకాశం కొట్టేయాలని దర్శకుడు శివకు ఫోన్ చేసి మరోసారి మనం వీరం చిత్రం తరహాలో దుమ్మురేపుదాం అని అడిగారు. అయితే ఆమె ఫోన్ టెక్నిక్ దర్శకుడు శివ వద్ద పని చేయలేదు. ఆమెకు తన నూతన చిత్రంలో అవకాశం కల్పించే విషయం గురించి మాట ఇవ్వలేకపోయారు.

కారణం ఈసారి ఇంతకుముందు జతకట్టని కొత్త కథానాయికతో నటించాలని అజిత్ భావించడమే. అందువలన ఈ చిత్రంలో చాన్స్ లేదనే విషయాన్ని దర్శకుడు చల్లగా తమన్నకు చెప్పేశాడు. దీంతో తమన్న చాలా అప్‌సెట్ అయిందట. అయితే ప్రస్తుతం ఆమె ఆర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆరంభం చిత్రం తరువాత ఆర్య అజిత్‌కు మంచి ఫ్రెండ్ అయిపోయారు.

అజిత్ చిత్రంలో నటించడానికి ఆర్య సిఫార్సును ఉపయోగించుకోవలసిందిగా తమన్న స్నేహితులు చెవిలో ఊదుతున్నారట. అయితే బిరియాని విందుతో కథానాయికలను బుట్టలో వేసుకునే ఆర్యను అజిత్‌కు రికమెండ్ చేయమని ఎలా అడగాలి అని తమన్న సంకోచిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ గురువారం తెరపైకి రానుంది.