కామెడీకి మాస్ హీరో విశాల్ సై

1 Sep, 2013 00:55 IST|Sakshi
కామెడీకి మాస్ హీరో విశాల్ సై
మదగజరాజా చిత్ర యూనిట్ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రచార యాత్ర చేయనుంది. యువ నటుడు విశాల్ హీరోగా నటించిన చిత్రం మదగజరాజా. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకుడు. ఈయన  కమర్షియల్ కథా చిత్రాలను హాస్యంతో రంగరించి రూపొందించడంలో సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో మాస్ హీరో విశాల్‌తో హాస్యం పండించారు. జెమినీ ఫిలింస్ సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని నటుడు విశాల్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 
 
తెలుగులో నటరాజు తనే రాజు (ఎన్టీఆర్) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఆరున విడుదల చేయనున్నారు. సోమవారం కేరళలోని కొచ్చిలో మదగజరాజా చిత్ర యూనిట్ ప్రచారం ప్రారంభించనుంది. తర్వాత కర్ణాటకలోని బెంగళూరు, ఆంధ్రాలోని హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో ఈ ప్రచార బృందం పయనించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాలలో విశాల్‌తో పాటు నటి వరలక్ష్మి, దర్శకుడు సుందర్ సీ, చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.