నయన మరో మాయ చేస్తుందా?

6 Jun, 2016 02:04 IST|Sakshi
నయన మరో మాయ చేస్తుందా?

నాయకిగా అగ్రస్థానంలో వెలుగొందుతున్న నటి నయనతార. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. శింబుతో రొమాన్స్ చేసిన ఇదునమ్మఆళు చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. జీవాతో జత కట్టిన తిరునాళ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా కార్తీ సరసన నటించిన కాష్మోరా, విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ఇరుముగన్, తెలుగులో వెంకటేశ్‌తో బాబు బంగారం చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇక మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్త్తికేయన్‌తో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఇవి కాక మరో నూతన చిత్రాన్ని అంగీకరించారు. ఈ బ్యూటీని రీఎంట్రీలో ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టిన చిత్రాల్లో మాయ ఒకటని చెప్పక తప్పదు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా నయన్‌కు మంచి విజయాన్ని అందించిన మాయ చిత్ర దర్శకుడు అశ్వన్ శరవణన్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ది హిందూ రంగరాజన్ మనవడు రోహిత్ రమేశ్ డబ్ల్యూఎఫ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థతో కలిసి మో అనే చిత్రాన్ని నిర్మిస్తున్న మూమెంట్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌పై నిర్మిస్తున్న జీఏ.హరిక్రిష్ణన్ మాయ చిత్ర దర్శకుడి తాజా చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మాయ చిత్రాన్ని హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన అశ్విన్‌శరవణ న్ తాజా చిత్రాన్ని వేరే బ్యానర్‌లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇదీ కథానాయకి చుట్టూ తిరిగే కథేనట. నాయకిది హిందీలో విద్యాబాలన్ నటించే తరహాలో చాలా బరువైన పాత్ర కావడంతో ఈ పాత్రలో నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ మాయ చిత్ర దర్శకుడికి పచ్చజెండా ఊపుతారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తమ చిత్రంలో నటించే తారాగణాన్ని వెల్లడిస్తామంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.